బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించిన కవిత

  • బీఆర్ఎస్ పార్టీ పేరుతో పాటు ఆత్మను కూడా మార్చుకుందని విమర్శ
  • మూల సిద్ధాంతం నుంచి తప్పుకుంటే పార్టీ మనుగడ సాగించలేదన్న కవిత
  • తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇంకా మిగిలే ఉన్నాయన్న కవిత
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం పాతిక సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పుట్టిందని, కానీ గత కొన్నేళ్లుగా ఆ పార్టీ తన పేరుతో పాటు పనితీరును, పార్టీ ఆత్మను కూడా మార్చుకుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. రేపు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు.

పేరు మార్పు మొదలు ప్రతి విషయంలో టీఆర్ఎస్ మారిందని, దీనితో ఆ పార్టీకి ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయిందని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా తన ప్రాథమిక ఉద్దేశం, మూల సిద్ధాంతం నుంచి పక్కకు తప్పుకుంటే ఆ పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని అన్నారు. బీఆర్ఎస్ తన ప్రాథమిక ఉద్దేశం నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ఆ పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ప్రభుత్వం మారినా తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆంక్షలు ఇంకా మిగిలే ఉన్నాయని అన్నారు. వీటిని సాధించడమే తాను ప్రారంభించబోయే పార్టీ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రజల కోసం పని చేసే స్వచ్ఛమైన ప్రాంతీయ పార్టీ అవసరం ఇప్పుడు తెలంగాణకు ఉందని అన్నారు.

Kavitha fires at BRS
Kavitha takes on BRS

More Telugu News